స్నేహితుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్​కు నిండు ప్రాణం బలి..
1 min read

స్నేహితుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్​కు నిండు ప్రాణం బలి..

తెల్లవారుజామున టిఫిన్​ చేసేందుకు ఐటీ కారిడార్​కు వచ్చిన నలుగురు యువకులు

 బైక్ అదుపుతప్పి డిడైర్​ను ఢీకొట్టడంతో యువకుడు మృతి

ప్రాణాపాయ స్థితిలో  బైక్​ నడిపిన యువకుడు

 

ఓ స్నేహితుడి నిర్లక్ష్యానికి మరో స్నేహితుడు బలయ్యాడు. నలుగురు యువకులు తెల్లవారుజామున టిఫిన్​ చేద్దామని రెండు బైకులపై ఐటీ కారిడార్​కు వెళ్లారు. అక్కడ టిఫిన్​ దొరక్కపోవడంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇందులో ఓ యువకుడు ​ బైక్​ను స్పీడ్​గా డ్రైవ్​ చేయడంతో కంట్రోల్​ తప్పి రోడ్డు మధ్యలో డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​ వెనుక కుర్చొన్న యువకుడి తలకు తీవ్ర గాయాలై మృతి చెందగా, బైక్​ నడిపిన వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐటీ కారిడార్​లోని గచ్చిబౌలి పిజేఆర్​ ఫ్లైఓవర్​పై ఈ ప్రమాదం జరిగింది.

 

.పుప్పాలగూడ శ్రీ చండేశ్వర యునిక్యూ రెసిడెన్సీలో నివాసం ఉండే వికాస్​ కుమార్​ నీపక్​(25) ప్రైవేటు ఉద్యోగి. హఫీజ్​పేట్​ మార్తండనగర్​లో నివాసం ఉండే పిల్లి కళ్యాణ్​, గణేష్​, భరత్​కుమార్​ నలుగురు స్నేహితులు. వీరు నలుగురు కలిసి సోమవారం ఉదయం 4 గంటల సమయంలో రెండు బైకులపై టిఫిన్​ చేసేందుకు హఫీజ్​పేట్​ నుండి నానక్​రాంగూడకు వెళ్లారు. అక్కడ టిఫిన్​ లభించకపోవడంతో తిరిగి హఫీజ్​పేట్​కి బయలుదేరారు. ఒక బైక్​పై భరత్​కుమార్​, వికాస్​కుమార్​ మరో బైక్​పై కళ్యాణ్​ గణేష్​లు ప్రయాణిస్తున్నారు.

ప్రమాదానికి గురైన బైక్​

భరత్​కుమార్​ బైక్​ను నిర్లక్ష్యంగా ఓవర్​ స్పీడ్​గా డ్రైవ్​ చేయడంతో గచ్చిబౌలి పిజేఆర్​ ఫ్లైఓవర్​ వద్దకు చేరుకోగానే బైక్​ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​ వెనుకాల కుర్చొన్న వికాస్​కుమార్​ తలకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్​ ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వికాస్​ మృతి చెందాడు.

 

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భరత్​కుమార్​ మాదాపూర్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి స్నేహితుడు కళ్యాణ్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.