సైబరాబాద్​లో ప్రయోగాత్మకంగా సైబరాబాద్​ క్లీన్​ స్వీప్​ డ్రైవ్​
1 min read

సైబరాబాద్​లో ప్రయోగాత్మకంగా సైబరాబాద్​ క్లీన్​ స్వీప్​ డ్రైవ్​

 

22 కిలోమీటర్ల దూరం.. క్లీన్​ స్వీప్​ డ్రైవ్​..

 

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కమిషనర్​ సృజన

సైబరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా సైబరాబాద్​ క్లీన్​ స్వీప్​ డ్రైవ్​ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సైబరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​ సృజన. ఈ కార్యక్రమంలో ఒక రూట్​ సెలెక్ట్​ చేసుకొని ఆ ఏరియాల్లో క్లీన్​ స్వీప్​ డ్రైవ్​ నిర్వహించారు. ఈ కార్యక్రమం పటాన్​చెరు నుండి బీహెచ్​ఈఎల్​, గచ్చిబౌలి, ఖాజగూడ, లాంకోహిల్స్​ మీదుగా మణికొండ వరకు 22 కిలోమీటర్లు ఈ డ్రైవ్​ సాగింది. ఈ క్లీన్​ స్వీప్​ డ్రైవ్​ విజయవంతం కావడంతో శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని శేరిలింగంపల్లి జోనల్​ కమిషనరేట్ కాన్ఫరెన్స్​ హాల్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో జోనల్​ కమిషనర్​ హేమంత్​ బోర్ఖడేతో కలిసి సిఎంసి కమిషనర్​ సృజన వివరాలను వెల్లడించారు.

డ్రైవ్​ వివరాలు వెల్లడిస్తున్న సిఎంసి కమిషనర్​ సృజన

ఈ సందర్భంగా కమిషనర్​ మాట్లాడుతూ..సైబరాబాద్​ కమిషనరేట్​ను క్లీన్​గా ఉంచేందుకు సైబరాబాద్​ క్లీన్​ స్వీప్​ డ్రైవ్​ పేరిట ప్రయోగాత్మకంగా ప్రారంభించామన్నారు. ఈ డ్రైవ్​ను ప్రతి శనివారం లేదా అదివారం నిర్వహిస్తామన్నారు. సైబరాబాద్​లో అత్యధికంగా ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగులు ఉన్న నేపథ్యంలో ఈ డ్రైవ్​లో ఐటీ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వామ్యం చేసుకొని ముందుకు వెళ్తామన్నారు. శనివారం ఉదయం 6 గంటలకు పటాన్​చెరులో ప్రారంభించిన ఈ డ్రైవ్​ మణికొండ వరకు 22కిలోమీటర్లు కొనసాగింది. 44 పార్టులుగా 500 మీటర్ల చొప్పున విభజించామన్నారు.

 

ఈ డ్రైవ్​లో 128 అధికారులు, 750 మంది సిబ్బంది పాల్గొన్నారు. 22 కిలోమీటర్ల దూరంలో రోడ్ల వెంట ఉన్న చెత్త, పేరుకుపోయిన ఇసుక, సీ ఆండ్​ డి వెస్ట్​, చెట్ల కొమ్మలు, ఫుట్​పాత్ల అక్రమణలు, విద్యుత్​ దీపాలు, తెగిపోయిన కేబుల్​ వైర్లు తొలగించడంతో పాటు సరిచేయడం జరిగిందన్నారు. దాదాపు 1000 మెట్రిక్​ టన్నుల వ్యర్థాలను తొలగించామన్నారు. కమిషనరేట్​ పరిధిలో నిర్మాణ వ్యర్థాలను డంప్​ చేయడం తప్పయితే, ఆ వ్యర్థాలను తొలగించకపోయిన అధికారులది తప్పేనని తెలిపారు. ప్రజలు ఇవ్వరూ రోడ్లపై చెత్తను వేయవద్దని, తమ ఇంటి వద్దకు వచ్చే స్వచ్ఛ ఆటోలోనే చెత్తను వేయాలన్నారు.

 

తాము చేపట్టిన ఈ క్లీన్​ స్వీప్​ డ్రైవ్​లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. రోడ్లపై ఇష్టానుసారంగా చెత్త వేసిన వ్యక్తులకు వ్యాపార సముదాయాలకు రూ. 11 లక్షల పెనాల్టీలు విధించామన్నారు. త్వరలోనే చెత్తను తరలించే ఆటోలను ఈవీగా మార్చునున్నట్లు తెలిపారు. వచ్చే వర్షకాలం నాటికి సైబరాబాద్​లో 15 లక్షల మొక్కలను నాటుతామని అన్నారు. వర్షకాలం వచ్చేలోపు నాలాలో పూడికతీతను పూర్తి చేస్తామన్నారు.

 

సైబరాబాద్​లో మొత్తం 312 చెరువులు ఉంటే అందులో 261 చెరువుల్లో గుర్రపుడెక్క ఉందన్నారు. గుర్రపుడెక్క తొలగించేందుకు టెండర్లు పిలిచామని, వర్షకాలం ప్రారంభమయ్యే లోపు చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగిస్తామన్నారు. సైబరాబాద్​ను అన్నీ రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిఎంసి అధికారులు పాల్గొన్నారు.