బయటపడ్డ నిత్య పెండ్లి కొడుకు మరో బాగోతం.. ఐటీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి
- ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి..
- 50 మంది నుండి 2 నుండి 5 లక్షల వరకు వసూళ్లు
- రినోవేషన్ పేరుతో కంపెనీ మూసేసిన నిందితులు..
- నిరుద్యోగులను ముంచింది.. నిత్య పెండ్లి కొడుకే..
- 2022లో 13 మందిని పెండ్లి చేసుకొని మోసం చేసిన అడప శివ శంకర్ బాబు..
శేరిలింగంపల్లి, వార్తమ్యాన్ : విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్గా చేసుకొని 13 మంది మహిళలను పెండ్లి చేసుకున్న నిత్య పెండ్లి కొడుకు అడప శివ శంకర్బాబు మరో బాగోతం బయటపడింది. పేరు మార్చుకొని మాదాపూర్లో ఓ ఐటీ కంపెనీ మొదలుపెట్టి.. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువత నుండి కోట్లాది రూపాయలు వసూళు చేసిన ఘటన వెలుగు చూసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. దాదాపు 50 మంది నిరుద్యోగుల వద్ద డబ్బు వసూళు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఐటీ ఉద్యోగాల పేరుతో…
మాదాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో నివాసం ఉండే రాహుల్ (26) హైటెక్సిటీలోని ఓ కంపెనీలో నాన్ ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలని అనుకున్న రాహుల్ తన ప్రొఫైల్ను లింక్డిన్ వెబ్సైట్లో పోస్ట్ చేశాడు. మే 22వ తేదిన అన్వేష్ ఆలియాస్ అడప శివ శంకర్బాబు అనే వ్యక్తి రాహుల్కు కాల్ చేశాడు. తాను మాదాపూర్ కావూరిహిల్స్లోని అర్క బ్రాంకోమ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ అని, తమ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయని రాహుల్కు తెలియజేశాడు. జాబ్ గ్యారెంటీ కోసం అన్వేష్ డబ్బులు కట్టాలని చెప్పడంతో రాహుల్ అన్వేష్ సూచించిన ఫోన్పే నెంబర్( భార్య సంధ్యరాణి ఫోన్ పే నెంబర్)కు, కొంత క్యాష్ రూపంలో దశల వారికి మొత్తం రూ. 2,50,000 చెల్లించాడు.

రినోవేషన్ పేరు చెప్పి బిచానా ఎత్తేసి
డబ్బులు కట్టిన అనంతరం మాదాపూర్లోని అర్క బ్రాంకోమ్ సొల్యూషన్స్ అఫీస్కు వెళ్లిన రాహుల్కు కంపెనీ ప్రతినిధులు అఫర్ లెటర్ ఇచ్చారు. ప్రస్తుతం అఫీస్ రినోవేషన్ పనులు జరుగుతున్నాయని, ఒక 20 రోజుల పాటు కు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ట్రైనింగ్ ఉంటుందని చెప్పాడు అన్వేష్. ప్రస్తుతం అఫీస్కు చెందిన కంప్యూటర్స్ అందుబాటులో లేవని, మీరు సొంతంగా ల్యాప్టాప్ ద్వారా వర్క్ చేయాలని రాహుల్కు చెప్పాడు. ఆ తర్వాత అఫీస్ నుండి ఏలాంటి మెయిల్స్ కానీ ఫోన్స్ కానీ రాకపోవడంతో రాహుల్ కంపెనీ ప్రతినిధి అన్వేష్కు కాల్ చేస్తే రెస్సాన్స్ లేదు.

దీంతో మాదాపూర్లోని అర్క బ్రాంకోమ్ సొల్యూషన్స్ అఫీస్కు వెళ్లగా క్లోజ్ చేసి కనిపించింది. అఫీస్ వద్ద మరికొంత మంది ఐటీ ఉద్యోగం కోసం డబ్బులు కట్టి మోసపోయినట్లు రాహుల్ గుర్తించాడు. వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాహుల్ లాగా దాదాపు 50 మంది వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఒక్కోక్కరు అన్వేష్కు రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు.
అప్పుడు నిత్య పెండ్లి కొడుకు.. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఎండీ..
ఐటీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద కోట్లాది రూపాయలు వసూళు చేసిన అన్వేష్ అలియాస్ అడప శివ శంకర్బాబు సైబరాబాద్ పరిధిలో విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్గా చేసుకొని పదుల సంఖ్యలో మహిళలను పెండ్లి చేసుకున్న నిత్య పెండ్లి కొడుకు ఒక్కడే. సైబరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో శివ శంకర్బాబుపై చీటింగ్ కేసులు ఉన్నాయి. విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్గా పెట్టుకొని వారిని పెండ్లి చేసుకొని భారీగా డబ్బులు వసూళు చేసి చీటింగ్ చేసిన నిత్య పెళ్లికొడుకు శివశంకర్ను గచ్చిబౌలి పోలీసులు 2022 జులైలో అరెస్ట్ చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన అడప శివ శంకర్బాబు(36) మ్యాట్రిమోనీ సైబ్ ద్వారా విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్గా చేసుకొని వారితో పరిచయం పెంచుకునేవాడు. ఆతర్వాత తాను కూడా విడాకులు తీసుకున్నాని చెప్పి నమ్మించి వారిని పెండ్లి చేసుకున్నాడు. ఇప్పటి వరకు 13 మంది మహిళలను పెండ్లి చేసుకొని వేర్వేరు ఏరియాల్లో కాపురాలు పెట్టాడు. పెండ్లి తర్వాత యూఎస్లో జాబ్ వచ్చింది డబ్బులు కావాలంటూ లక్షల్లో డబ్బు తీసుకొని చీటింగ్ చేసేవాడు. 2022లో కొండాపూర్లో నివాసం ఉండే మహిళను శివశంకర్ పెండ్లి చేసుకొని యూఎస్కు వెళ్లాలని చెప్పి ఆమె వద్ద నుండి రూ. 32 లక్షల వరకు డబ్బు తీసుకున్నాడు. శివశంకర్పై అనుమానం వచ్చి సదరు మహిళ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
న్యాయం చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు మహిళలు ధర్నా..

ఒకరికి తెలియకుండా ఒకరిని పెండ్లి చేసుకొని, అవసరాల పేరిట డబ్బులు తీసుకొని చీటింగ్ చేసిన శివ శంకర్బాబును అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధిత మహిళలు మహిళా సంఘాలతో కలిసి 2022 జూలైలో సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చెపట్టారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. సీపీ అఫీస్ ఎదుట తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. శివశంకర్ దాదాపు 13 మంది మహిళలను పెండ్లి చేసుకొని యూఎస్ వెళ్లాలంటూ అందిన కాడికి డబ్బులు తీసుకొని చీటింగ్ చేశాడని, పోలీసులు శివశంకర్ను వెంటనే అరెస్ట్ చేయాలని బాధిత మహిళలు డిమాండ్ చేశారు. శివశంకర్ను కఠినంగా శిక్షించి, బాధిత మహిళలకు న్యాయం చేయాలని మహిళా సంఘాల లీడర్లు పేర్కొన్నారు.
