రక్తసిక్తమైన ఐటీ కారిడార్ రోడ్లు… రెండు రోజుల్లోనే ఎంత మంది మృతి చెందారో తెలుసా..
రెండు రోజుల్లో మూడు రోడ్డు ప్రమాదాలు..
మొత్తం నలుగురు దుర్మరణం..
మృతుల్లో ఇద్దరు ఐటీ ఉద్యోగులు..
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు..
ఐటీ కారిడార్ రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. రాంగ్ రూట్, అతివేగం, అకస్మాత్తుగా మలపడం, అజాగ్రత్తగా వాహనాలు డ్రైవ్ చేయడం కారణంగా ఐటీ కారిడార్లో రెండు రోజుల వ్యవధిలో నలుగురు దుర్మరణం చెందారు. ఇందులో రాంగ్ రూట్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరి ప్రాణాలు కోల్పోగా.. ఐటీ ఉద్యోగి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికత్స పొందుతున్నాడు. మరో రోడ్డు ప్రమాదంలో ముందు వెళ్తున్న బైకర్ సడెన్గా యూటర్న్ తీసుకోగా వెనుకాలే వచ్చిన బైక్పై వచ్చిన వ్యక్తి ముందటి బైక్ను ఢీకొట్టి అక్కడిక్కడే ప్రాణాలొదిలాడు. మరో ప్రమాదంలో.. స్కూటీపై వెళ్తున్న భార్యభర్తలు యూటర్న్ తీసుకుంటుండగా వెనుక నుండి దూసుకువచ్చిన కారు ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా.. భర్త ఆసుపత్రిలో చేరాడు.
ఇవే రోడ్డు ప్రమాదాలు..
పటాన్చెరు ఇంద్రేశంకు చెందిన విట్టల్(38) తన బావ మరిది శ్రీకాంత్(17) ఇద్దరు స్థానికంగా చికెన్ సెంటర్లో పనిచేస్తారు. ఈ నెల 26వ తేదిన హైటెక్సిటీ, గచ్చిబౌలిలో చికెన్ డెలివరీ ఇవ్వడానికి స్కూటీపై పటాన్చెరు నుండి హఫీజ్ఫేట్ మీదుగా గచ్చిబౌలి వెళ్లేందుకు కొండాపూర్ ఆర్టీఏ అఫీస్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్పైకి రాంగ్రూట్లో వెళ్లారు. మధ్యలోకి వెళ్లాక.. హైటెక్సిటీ వైపు వెళ్లేందుకు అని యూటర్న్ తీసుకొని కొద్దిదూరం వెళ్లి.. తిరిగి గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు మరల యూటర్న్ తీసుకుంటుండగా.. అప్పుడే నైట్ డ్యూటీ ముగించుకొని గచ్చిబౌలి నుండి హైటెక్సిటీ వైపు వెళ్తున్న వినోద్ వీరి స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంతో తీవ్ర గాయాలతో విట్టల్, శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. ఐటీ ఉద్యోగి వినోద్ తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
26వ తేదిన రాత్రి 11 గంటల సమయంలో గచ్చిబౌలికి చెందిన ఐటీ ఉద్యోగి ఆనంద్సింగ్(27) బైక్పై ఖాజగూడ లేక్ నుండి గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి వైపు వెళ్తున్నాడు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఎదురుగా ఉన్న యూటర్న్ వద్దకు చేరుకునే సమయంలో ముందు వెళ్తున్న ఓ బైకర్ ఏలాంటి సిగ్నల్ ఇవ్వకుండా ఆకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నాడు. వెనుకాలే వచ్చిన ఆనంద్సింగ్ తన బైక్తో ముందున్న బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డ ఆనంద్సింగ్ స్పాట్లోనే మృతి చెందాడు.

బోరబండకు చెందిన ఐటీ ఉద్యోగిని కళ్యాణి(30) తన భర్త నరేష్తో కలిసి స్కూటీపై గచ్చిబౌలి బయో డైవర్సిటీ పార్కు సమీపంలో పక్వాన్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న యూటర్న్ వద్ద ములుపు తిప్పుతుండగా.. వెనుకాల నుండి వేగంగా దూసుకువచ్చిన ఓ ఇన్నోవా కారు వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కళ్యాణి తీవ్ర గాయాలతో చనిపోయింది. అమె భర్త నరేష్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

నిర్లక్ష్యం.. అతివేగం.. అవగాహనలేమి..
ఐటీ కారిడార్ రోడ్లపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో కొందరూ మృతి చెందుతుండగా… మరికొందరూ తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ ప్రమాదాలకు అతివేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్.. ట్రాఫిక్ రూల్స్పై అవగాహనలేమి ప్రధాన కారణాలు అని తెలుస్తోంది. వాహనాలను వేగంగా నడిపిస్తూ కంట్రోల్ తప్పి ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టి ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నారు.
మరికొందరూ ట్రాఫిక్ రూల్స్పై అవగాహన లేక అపసవ్య దిశలో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవ్వడమే కాకుండా.. తాము ప్రాణాల మీదకు తెచ్చుకొని ఎదుటివారి ప్రాణాలను గండంలోకి నెడుతున్నారు. ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రతపై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ఎన్నీ రకాలుగా అవగాహన కల్పిస్తున్న వాహనదారులు మారడం లేదు.
అఫీసులకు తొందరగా వెళ్లాలనే ఉద్యోగుల హడావుడి.. ఫుడ్ డెలివరీలు చేసే వారు తొందరగా డెలివరీ చేయాలనే ఆలోచనతో వాహనాలు అడ్డదిడ్డంగా నడుపుతుండడంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
