దుర్గం చెరువులో 5 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డ ఆంధ్ర (సినీ) ప్రజాప్రతినిధి
1 min read

దుర్గం చెరువులో 5 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డ ఆంధ్ర (సినీ) ప్రజాప్రతినిధి

 

స్థలం నాదేనంటూ దర్జాకు పార్కింగ్​ దందా..

ప్రతి నెల 50 లక్షల అద్దె వసూళు..

దుర్గం చెరువు ఆక్రమ‌ణ‌లకు హైడ్రా చెక్‌

-5 ఎక‌రాల మేర క‌బ్జాల‌ను తొల‌గించిన హైడ్రా

 

ఎత్తైన కొండ‌ల మ‌ధ్య సీక్రేట్ లేక్ గా పేరుగాంచిన దుర్గంచెరువు అప్పుడు ఎన్నీ ఎకరాలు విస్తరించి ఉంది.. ప్రస్తుతం ఎన్నీ ఎకరాలు ఉందో తెలుసా. ఒకప్పుడు నిజాం రాజులకు తాగునీటిని అందించిన దుర్గం చెరవు ప్రస్తుతం మురుగునీటితో కంపుకొడుతుంది. రెండు ప్రాంతాలను కలుపుతూ ఉన్న దుర్గం చెరువు క్రమక్రమంగా కబ్జాదారుల కబంద హస్తాల్లో చిక్కుతుంది. చెరువుకు ఉత్తర దిక్కు త‌ప్పితే.. మిగిలిన మూడువైపులా ఆక్రమ‌ణ‌ల‌కు గురైంది.

 

160 ఎకరాలు విస్తరించి ఉన్న చెరువు ప్రస్తుతం 116 ఎకరాలకు కుచించుకుపోయింది. చెరువు స్థలంలో మట్టిని నింపి ఏకంగా ప్రైవేట్​ బస్సుల కోసం పార్కింగ్​ స్థలంగా మార్చుకున్నాడు ఓ కబ్జాదారుడు. ప్రతి నెల 50 లక్షల వరకు అద్దె వసూళు చేస్తూ దర్జాగా చెరువు స్థలంపై అజమాయిషి చెలాయిస్తున్నాడు. చెరువు అక్రమణలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో అన్నీ శాఖల అధికారులతో పరిశీలించి మంగళవారం చెరువు అక్రమణలను తొలగించారు. స్థలం చుట్టూ ఫెన్సింగ్​ వేసి బోర్డును ఏర్పాటు చేశారు.

చెరువు స్థలంలో పార్కింగ్​ చేసిన బస్సులు

 

మంచినీరు అందించిన చెరువు నేడు మురుగునీటితో దుర్గంధం

 

మాదాపూర్​, జూబ్లీహిల్స్​ మధ్య ఉన్న దుర్గం చెరువు గోల్కొండ కోట‌లోని రాజ‌వంశానికి తాగు నీరందించింది. ప్రస్తుతం అదే చెరువు కాంక్రీట్​ జంగీల్​గా మారిన ప్రాంతల నుండి వచ్చి చేరుతున్న మురుగునీటితో దుర్గంధం వెదజల్లుతుంది. కొండ‌ల మ‌ధ్య ఎంతో శుద్ధమైన జ‌లాల‌తో దాహార్తిని తీర్చిన ఈ చెరువు క‌బ్జాల‌తో కుంచించుకుపోయింది. ఒక‌ప్పుడు160 ఎక‌రాల మేర ఉన్న చెరువు నేడు 116 ఎక‌రాలుగా మిగిలిపోయింది.

 

చెరువుకు ఉత్తర దిశ త‌ప్పితే.. మూడువైపులా ఆక్రమ‌ణ‌ల‌కు గురైంది.1976 నాటికే 29 ఎక‌రాల వ‌ర‌కూ క‌బ్జా అయి.. 131.66 ఎక‌రాల‌కు మిగిలిపోయింది. 1976 వ సంవ‌త్సరం నుంచి 1995 వ‌ర‌కూ భ‌ద్రంగానే ఉంది. 1995 నుంచి 2000 సంవ‌త్సరం వ‌ర‌కూ మ‌రో 10 ఎక‌రాల మేర క‌బ్జాకు గురై..121 ఎక‌రాల‌కు కుంచించుకుపోయింది. 2000 నుంచి నేటికి మ‌రో 5 ఎక‌రాలు క‌బ్జాకు గుర‌య్యింది. ఇలా ఎప్పుడు ఏ సంవ‌త్సరంలో క‌బ్జాల ప‌ర్వం ఎలా సాగిందో ఎన్ ఆర్ ఎస్ సీ అందించిన శాటిలైట్ చిత్రాలు క‌ళ్లకు కట్టినట్లు తెలియజేస్తున్నాయి.

చెరువు చుట్టూ ఏర్పాటు చేస్తున్న ఫెన్సింగ్​

 

కబ్జా చేసి నెలకు రూ. 50 లక్షల పార్కింగ్​ దందాకు తెరలేపిన ప్రజాప్రతినిధి

 

మాదాపూర్ ఇనార్బిట్​ మాల్ వైపు రోడ్డుకు అనుకొని ఉన్న చెరువు స్థలంలో అర్దరాత్రి వేళ మట్టి తీసుకువచ్చి అక్రమంగా పూడ్చుకుంటూ వచ్చారు. ఏకంగా 5 ఎక‌రాలు క‌బ్జా చేశారు. కొండ‌ల‌ను త‌వ్వుతూ భ‌వంతులు నిర్మించిన వారికి దుర్గం చెరువు డంపింగ్ యార్డుగా మారింది. 10 నుంచి 15 మీట‌ర్ల మేర మ‌ట్టితో నింపి క్రమంగా చెరువులోకి జ‌రిగి ఏకంగా 5 ఎక‌రాల‌ను క‌బ్జా చేశారు. అలా చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఆక్రమించిన స్థలం నాదంటూ ఓ ప్రజాప్రతినిధి ఇప్పుడు క్లైం చేస్తున్నారు.

కబ్జాకు గురైన దుర్గం చెరువును చూపెట్టే మ్యాప్​

 

అంతే కాదు.. స్కూల్ బ‌స్సులు, ఐటీ సంస్థల‌కు చెందిన వాహ‌నాల పార్కింగ్‌తో ప్రతి నెల రూ. 50 ల‌క్షల వ‌ర‌కూ అద్దెలు అనుభ‌విస్తున్నారు. భూమికి సంబంధించిన రికార్డులు లేకుండానే అక్కడ పార్కింగ్ దందా చేస్తున్నారు. నెమ్మదిగా మ‌ట్టిని నింపుకుంటూ ఎక‌రం నుంచి 5 ఎక‌రాల వ‌ర‌కూ ఆ ప్రజా ప్రతినిధి ఆక్రమించేశారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి కూడా ఈ ఆక్రమ‌ణ అడ్డుగా మారింది.

 

ఆయ‌న‌ద‌ని చెబుతున్న భూమే ప్రతి ఏటా పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. హెచ్ ఎం డీ ఏ మాత్రం 2014లో 160.7 ఎక‌రాలుగా నిర్ధారిస్తూ ప్రిలిమ‌న‌రీ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఎన్ ఆర్ ఎస్ సీ, స‌ర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెరువు వైశల్యాన్ని తేల్చే ప‌నిలో హైడ్రా నిమ‌గ్నమైంది. ఈలోపు చెరువు ప‌రిధిలో ఉన్న ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గిస్తోంది.