కబ్జాదారుల నుండి రూ. 13 కోట్ల పార్కు స్థలం కాపాడిన హైడ్రా
1 min read

కబ్జాదారుల నుండి రూ. 13 కోట్ల పార్కు స్థలం కాపాడిన హైడ్రా

 

కబ్జాదారుల చెరులో ఉన్న 13 కోట్ల విలువైన 1000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. పార్కు స్థలం చుట్టూ వేసిన ప్రీకాస్ట్​ వాల్​ను కూలగొట్టి కబ్జా చెరు నుండి విముక్తి చేశారు. శేరిలింగంపల్లి మండలం మదీనగూడ గ్రామంలో సర్వే నెంబర్​ 23లో హుడా అనుమతితో ఉషోద‌య ఎన్‌క్లేవ్ పేరిట కాలనీ ఏర్పాటు అయ్యింది. ఇందులో 1000 గ‌జాల స్థలాన్ని పార్కుకు కేటాయించారు. జీహెచ్ఎంసీకి ఈ మేర‌కు గిఫ్ట్ డీడ్ కూడా చేశారు. పార్కు స్థలాన్ని స్థానికంగా ఉన్న నాయకుడు క‌బ్జా చేసి చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించి త‌న ఆధీనంలో ఉంచుకున్నారు.

తమ కాలనీ పార్కు స్థలం కబ్జాపై ఉషోద‌య ఎన్‌క్లేవ్ నివాసితులు స్థానిక జీహెచ్​ఎంసి, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడంతో హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. ప్రజావాణిలో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారుల‌తో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పార్కును పరిశీలించారు. పార్కు స్థలం కబ్జాకు గురైందని నిర్ధారించుకుని సోమ‌వారం ప్రహ‌రీని కూల్చేసి.. చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రజావ‌స‌రాల‌కు పార్కుగా కేటాయించిన స్థలంగా పేర్కొంటూ హైడ్రా అధికారులు బోర్డుల‌ను ఏర్పాటు చేశారు.