అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త..
- రోడ్డు వెంట వెళ్తున్న పాదచారిపై కర్రలతో దాడి చేసి దారి దోపిడీ
- చికిత్స పొందుతూ పాదచారి మృతి

హైదరాబాద్ రోడ్లపై అర్ధరాత్రి వేళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త. కొందరూ అకతాయిలు బైకులపై తిరుగుతూ రోడ్డు వెంట ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్గా చేసుకొని దారి దోపిడికి పాల్పడుతున్నారు. వారికి అడ్డు చెబితే అంతే సంగతులు. తమ వెంట తెచ్చుకున్న కర్రలతో దాడి చేసి దోపిడీకి పాల్పడుతున్నారు.
ఇటీవల ఐటీ కారిడార్లో రోడ్డు వెంట అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఓ పాదచారిపై నలుగురు యువకులు కర్రలతో దాడి చేసి అతని వద్ద ఉన్న సెల్ఫోన్, నగదును ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ ఆ పాదచారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దాడి చేసిన నలుగురు యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే ఈ దాడికి పాల్పడ్డ వారిలో ఇద్దరు మైనర్ బాలురు కూడా ఉండడం విశేషం.
బీహార్ రాష్ర్టం మధుబనీ ప్రాంతానికి చెందిన సౌరభ్కుమార్(24) కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చి రాయదుర్గం ప్రశాంత్నగర్కాలనీలో నివాసం ఉంటున్నారు. సౌరభ్కుమార్ స్థానికంగా సీసీటీవి టెక్నీషియన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. టోలిచౌకి హకీంపేట్లో నివాసం ఉండే మహ్మద్ రేహన్(19), మహ్మద్ ఇబ్రహీం అహ్మద్(19)లతో పాటు మరో ఇద్దరు మైనర్ బాలురు చిన్న చిన్న పనులు చేసుకుంటూ అవారాగా తిరుగుతున్నారు. అర్దరాత్రి బైకులపై తిరుగుతున్న ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వారి వద్ద సెల్ఫోన్లు, డబ్బులు దోపిడీ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
ఈ నెల 10వ తేదిన అర్ధరాత్రి సౌరభ్కుమర్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 నుండి రాయదుర్గం ప్రశాంతిహిల్స్ కాలనీ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే రోడ్డులో రేహన్, ఇబ్రహీం అహ్మద్లు కలిసి పల్సర్ బైక్పై, ఇద్దరు మైనర్లు కలిసి డియో బైక్ వెళ్తుండగా సౌరభ్కుమార్ తారసపడ్డాడు. దీంతో రేహన్, ఇబ్రహీం అహ్మద్లు సౌరభ్ వద్ద బైక్ అపి లిఫ్ట్ ఇస్తామని చెప్పడంతో సౌరభ్ వారి బైక్ ఎక్కాడు. కొద్దిదూరం వెళ్లాక సౌరభ్ను సెల్ఫోన్, డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించాడు. దీంతో సౌరభ్ వారి బైక్ దిగి, అసభ్య పదజాలంతో దూషించడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. రోడ్డు వెంట వెళ్తున్న వారు అక్కడికి రావడంతో నలుగురు యువకులు అక్కడి నుండి బైకులతో పారిపోయారు.
అనంతరం ఓ హోటల్లో కలుసుకున్న నలుగురు యువకులు తమకు జరిగిన అవమానంపై పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. నలుగురు కలిసి రెండు బైకులపై సౌరభ్కుమార్ కోసం గాలిస్తూ, మార్గమధ్యంలో నిర్మాణ భవనం వద్ద సెంట్రింగ్ కర్రలను వెంట పెట్టుకొని వెళ్తుండగా బీఎన్ఆర్ హిల్స్ రోడ్డు వెంట లెథర్ కంపెనీ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న సౌరభ్కుమార్ కనిపించాడు. దీంతో నలుగురు యువకులు కలిసి కర్రలతో సౌరభ్పై విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం అతని వద్ద నుండి సెల్ఫోన్, డబ్బులు లాక్కొని అక్కడి నుండి పారిపోయారు.
స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న సౌరభ్ను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు సౌరభ్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే సౌరభ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందగా, అతని సోదరుడు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దాడి విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌరభ్ ఈ నెల 13వ తేదిన మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రేహన్, ఇబ్రహీం అహ్మద్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు మైనర్ బాలురను జువైనల్ హోంకు తరలించారు.
