ఇంటికి వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలో బంగారం ఎత్తుకెళ్లిన చైన్​స్నాచర్​
1 min read

ఇంటికి వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలో బంగారం ఎత్తుకెళ్లిన చైన్​స్నాచర్​

 

బంగారం ధర పెరగడంతో రెచ్చిపోతున్న చైన్​ స్నాచర్లు

శనివారం ఇద్దరు మహిళల మెడలో 13 లక్షల 8 తులాల బంగారం లాక్కెళ్లిన స్నాచర్​

 

బంగారం ధర అకాశాన్ని తాకుతుండడంతో ఇదే అదునుగా చైన్​ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలే టార్గెట్​గా స్నాచింగ్​కు పాల్పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం గుడిలో అన్నదానానికి వెళ్లి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలో నుండి ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి బంగారు గొలుసులు లాక్కెళ్లాడు. ఈ సంఘటనతో స్థానికంగా ఒక్కసారిగా అలజడి రేగింది. ఒకేసారి ఇద్దరు మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్లడంతో స్థానికంగా ఉన్న మహిళలు భయాందోళన చెందుతున్నారు.

 

లింగంపల్లి ఓల్డ్​ ఎంఐజీలో నివాసం ఉండే పొట్లపల్లి సత్యవతి(73), చాగంటిపాటి జయభారతి(72) ఇద్దరు కలిసి శనివారం ఉదయం కిలోమీటర్​ దూరంలో ఉన్న రామాలయం దేవాలయానికి వెళ్లారు. అక్కడ భోజనాలు చేసాక తిరిగి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వీరికి ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి సత్యవతి మెడలో నుండి బంగారు పుస్తెలతాడు, నల్లపూసల దండ, జయభారతి మెడలో బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఉదంతంతో ఉలిక్కిపడ్డ ఇద్దరు మహిళలు వెంటనే తమ కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.

 

సంఘటన స్థలానికి చేరుకున్న చందానగర్​ పోలీసులు ఇద్దరు ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సత్యవతి మెడలో 6 తులాల బంగారం, జయభారతి మెడలో రెండు తులాల బంగారు గొలుసు స్నాచింగ్ జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో చైన్​ స్నాచర్​ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చైన్​ స్నాచర్​ కోసం ఓల్డ్​ ఎంఐజీ చుట్టూ సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. 8 తులాల బంగారం విలువ దాదాపు రూ. 13 లక్షలు ఉంటుందని బాధిత మహిళలు చెబుతున్నారు.