ప్రభుత్వంపై రూ.13 వేల కోట్ల భారం.. అయినా సన్న బియ్యంతో పేదవాడి ఆకలి తీరుస్తున్నాం
1 min read

ప్రభుత్వంపై రూ.13 వేల కోట్ల భారం.. అయినా సన్న బియ్యంతో పేదవాడి ఆకలి తీరుస్తున్నాం

  • రాష్ర్ట అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడుతా
  • నిధుల కోసం ఢిల్లీకి ఒకటికి వంద సార్లు తిరుగుతా
  • నాకు ఓపిక ఉంది.. వయసుంది
  • కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ సంకల్పం
  • ప్రజా పాలన.. విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

 

తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం ఢిల్లీనైనా ఢీ కొడతానని, ఫండ్స్​ తీసుకువస్తానని.. అడగాడనికి వెనుకాడనన్నారు తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి. రాష్ర్ట అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా.. రాష్ట్రానికి కావలసిన నిధులు, రావలసిన అనుమతుల కోసం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి అడగడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత అని పేర్కొన్నారు.

మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో రూ. 532.24 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంత నిర్వహించిన రంబహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

రాష్ర్ట అభివృద్ధి కోసం ఢిల్లీకి ఒకటికి వంద సార్లు తిరుగుతానని, నాకు ఓపిక ఉంది.. వయసుంది.. విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకుంది.. మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు.

కాకతీయ కాలం నుంచి ప్రపంచానికి పోరాట పంథాను చాటిచెప్పిన వరంగల్ గడ్డ, సమ్మక్క – సారలమ్మ, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కృష్ణమాచార్యులు, కాళోజీ నారాయణ రావు, పీవీ నర్సింహరావు నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొ జయశంకర్ ప్రజా ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలుస్తారని గుర్తు చేశారు. వారి స్ఫూర్తిగానే ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

నిరుపేదలు, దళిత, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ పిల్లలు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని, అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన చదువులు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేశారు. తాతముత్తాల కాలం పది తరాలుగా వృత్తులు చేసుకుంటూ వచ్చినా బతుకులు మారలేదని, చదువొక్కటే మన బతుకుల్లో మార్పు తీసుకొస్తుందని, నిలబెడుతుందని, ప్రపంచంతో పోటీ పడేలా చేస్తుందని పేర్కొన్నారు.

సభలో పాల్గొన్న ప్రజలు

ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అనేక సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని.. ఒకవైపు రైతులు, మరోవైపు మహిళలు, ఇంకోవైపు యువత కోసం కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. యువత కోసం ఉద్యోగ నియాకాలు చేపట్టామని, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది లోపే 61 వేల ఉద్యోగాలిచ్చామన్నారు. ఇంకా 40 వేల ఉద్యోగాలిచ్చే ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని తెలిపారు.

అభివృద్ధి పథంలో సాగాలంటే ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యునికేషన్ అత్యంత కీలకమని, ఆయా రంగాల్లో లక్ష్యాలను సాధించడానికి ఈ నెల 8, 9, తేదీల్లో ప్రపంచ స్థాయిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామన్నారు.

హైదరాబాద్‌తో సమంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని, పక్క రాష్ట్రాల్లో నాలుగైదు విమానాశ్రయాలుంటే, తెలంగాణలో ఒక్కటి మాత్రమే ఉందన్నారు. పదేండ్ల పాలనలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం వీటి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. కనీసం రోడ్లు వేయలేదన్నారు. డిసెంబర్ ఆఖరునాటికి భూ సేకరణ పూర్తి చేసి మార్చి 31 లోపు వరంగల్ విమానాశ్రయ పనులు ప్రారంభిస్తామన్నారు.

హైదరాబాద్ తరహాలోనే వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్ పోర్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క – సారలమ్మ మందిరం అద్భుతంగా నిర్మాణవుతోందని, అదే తరహాలో వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.

రాష్ట్రంలో ప్రతి మారుమూల తండాకు రోడ్డు కనెక్టివిటీ ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలో ఏ గ్రామానికీ రోడ్డు లేదన్న మాట వినదలచుకోలేదని అన్నారు. రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 20 వేల కోట్లు వెచ్చించి రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ప్రతి గూడెం నుంచి మండల కేంద్రానికి, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరుసలు, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి నాలుగు వరుసల రోడ్లు వేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో మహిళాభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఉచిత బస్సు సౌకర్యం, సంఘాలకు వడ్డీ లేని రుణాలు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్, బస్సులకు యజమానులుగా.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.

ఇంటి ఆడబిడ్డకు చీరె పెట్టడం ఒక సంప్రదాయమని, ఇంట్లో సొంత సోదరుడి తరహాలో ప్రతి ఏటా సారె పండుగ చేసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది ఆడబిడ్డలకు చీర అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డకు చీరె చేరాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని అనొద్దని, గ్రామీణ ప్రాంతాల్లో పూర్తయ్యాక, మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ, మున్సిపాలిటీల్లో చీరె అందజేస్తామన్నారు.

ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 1.10 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, 3.10 కోట్ల మంది బిడ్డలకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. ప్రభుత్వంపై 13 వేల కోట్ల రూపాయల భారం అవుతున్నా పేదవారి ఆకలి తీర్చాలని, వారు కడుపునిండా భోజనం చేయాలని సన్నబియ్యం ఇస్తున్నామన్నారు.

పేదవారి ఆత్మగౌరవం పెరగాలన్న లక్ష్యంతో వారికి ఇందిరమ్మ ఇండ్లు ఉండాలని, ఆర్థికంగా భారమైనప్పటికీ ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల పనులు మొదలయ్యాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, సీతక్క, కొండ సురేఖ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.