ఐటీ కారిడార్లో డ్రగ్స్ పట్టివేత.. అమ్ముతున్న వారిలో ఇద్దరు స్టూడెంట్స్
ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు, ఇద్దరు డ్రగ్స్ వినియోగదారులు అరెస్ట్
పట్టుబడ్డ వారిలో ఇద్దరు స్టూడెంట్స్
కొకైన్, మ్యాజిక్ మష్రూమ్, హషీష్కేక్, ఎండిఎంఏ, ఎల్ఎస్డి స్టాంప్ పేపర్లు స్వాధీనం
ఐటీ ఉద్యోగులు, విద్యార్ధులే లక్ష్యంగా అడ్డదారిలో నగరానికి డ్రగ్ పెడ్లర్లు డ్రగ్స్ను తీసుకువచ్చి భారీ మొత్తానికి అమ్ముతున్నారు. శనివారం మియాపూర్లో పోలీసులు డ్రగ్స్ పట్టివేశారు. గోవా నుండి హైదరాబాద్కు బస్సులో డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తున్నారనే సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఓ ఇంటిపై రైడ్ చేసి డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులు, కొనుగోలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. వీరి వద్ద నుండి రూ. 1.98 లక్షల విలువైన కొకైన్, హాషిష్ కేక్, చరస్, ఎండిఎంఏ, ఎల్ఎస్డి స్టాంప్ పేపర్లు, మ్యాజిక్ మష్రూమ్లు స్వాధీనం చేసుకున్నారు.

వీరిని మియాపూర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ సిద్ధార్థనగర్కాలనీలో నివాసం ఉండే అర్లికట్టే రాజేష్ అనిరుధ్(27) గ్రాఫిక్ డిజైనర్గా పనిచేస్తూ మత్తు కోసం డ్రగ్స్ తీసుకునే వాడు. ఆ తర్వాత డ్రగ్స్ను అమ్ముకమే జీవనాధారం చేసుకున్నాడు. హబ్సిగూడ స్ర్టీట్ నెం.8లోని హైమావతి అపార్ట్మెంట్లో నివాసం ఉండే సూర్యదేవర సుమంత్(24) ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటూ డ్రగ్స్కు అలవాటు పడి డ్రగ్స్ పెడ్లర్గా మారాడు. రాజేష్ గోవాకి వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి బస్సు ద్వారా శనివారం మియాపూర్కు చేరుకున్నాడు. హఫీజ్పేట్ ప్రేమ్నగర్లోని ఓ ఇంట్లో డ్రగ్స్ అమ్మకం జరుగుతుందని సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ప్రేమ్నగర్లోని ఇంటిపై రైడ్ చేశారు.
ఆ ఇంటిలో డ్రగ్స్ అమ్ముతున్న రాజేష్, సుమంత్తో పాటు సబ్ పెడ్లర్లు మియాపూర్ మదీనగూడకు చెందిన స్టూడెంట్ మన్నె సాయి కిరణ్(22), బీరంగూడ కెఎస్ఆర్కాలనీకి చెందిన స్కూల్ బస్సు డ్రైవర్ మహమ్మద్ సబీర్(24)లతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు వచ్చిన చందానగర్ గంగారంకు చెందిన డ్రైవర్ ముప్పి ఆకాశ్(21), జేఎన్టీయూ ఎస్ఎస్కాలనీకి ప్రాంతానికి చెందిన బుక్కూరి అభిషేక్పాల్(22)లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి రూ. 1.98 లక్షల విలువైన 2.5 గ్రాముల ఎండిఎంఏ, 5 గ్రాముల చరస్, 5 గ్రాముల హషీష్ కేక్, ఒక గ్రాము కొకైన్, 10 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 55 బోల్ట్ల ఎల్ఎస్డి స్టాంప్ పేర్లను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ అమ్ముతున్న వారిలో ఇద్దరు స్టూడెంట్స్..
అనంతరం వీరిని మియాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు రాజేష్ అనిరుధ్ గతంలో తిరుమలగిరి పోలీస్ స్టేషన్, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రెండవ నిందితుడు సుమంత్ నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్ అమ్ముతున్న వారిలో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. పిర్జాదిగూడకు చెందిన గన్నయ్య చేతన్(23) నగరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతున్నాడు. డ్రగ్స్కు అలవాటు పడ్డ చేతన్ అలియాస్ బబ్లూ ఆ తర్వాత డ్రగ్స్ సబ్ పెడ్లర్గా మారాడు. మదీనగూడకు చెందిన మరో విద్యార్థి సాయి కిరణ్ చదువుకుంటూనే డ్రగ్స్ సబ్ పెడర్ల్గా మారాడు.
