మార్చిలో పదవ తరగతి పరీక్షలు… అంతలోనే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
1 min read

మార్చిలో పదవ తరగతి పరీక్షలు… అంతలోనే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

 

మార్చి నెలలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్​లో జరిగింది. బీదర్​ రాష్ర్టం బాల్కి గ్రామానికి చెందిన రేవల సిద్ధయ్య భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఓల్డ్​ హఫీజ్​పేట్​లోని సాయినగర్​లో నివాసం ఉంటున్నాడు.

 

సిద్ధయ్య ఆటో డ్రైవర్​గా పనిచేస్తుండగా, పెద్ద కుమారుడు స్థానికంగా ఉన్న డీమార్ట్​లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ కుమారుడు శంకర్​ సొంతూరిలో గత సంవత్సరం పదవ పరీక్షలు రాసి ఫెయిల్​ అయ్యాడు. దీంతో మార్చి నెలలో పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యాడు. గత కొద్ది రోజులుగా సిద్ధయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా భార్య, పెద్ద కుమారుడు సిద్ధయ్యను చికిత్స కోసం బీదర్​కు తీసుకువెళ్లారు.

 

ప్రస్తుతం ఇంటి వద్ద శంకర్​, అతని బంధువు లింగయ్య ఇద్దరు ఉంటున్నారు. లింగయ్య కూకట్​పల్లిలోని ఓ కాలేజీలో ఇంటర్​ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం లింగయ్యను కాలేజీ వెళ్లేందుకు శంకర్​ బైక్​పై మియాపూర్​ మెట్రో స్టేషన్​ వద్ద డ్రాప్​ చేశాడు. కాలేజీకి లేట్​గా రావడంలో లింగయ్యను కాలేజీ లోపలికి రానియ్యకపోవడంతో తిరిగి మెట్రోలో మియాపూర్​కు చేరుకొని శంకర్​కు కాల్​ చేశాడు.

 

శంకర్​ కాల్​ లిఫ్ట్​ చేయకపోవడంతో నిద్ర పోయాడనుకొని లింగయ్య ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఉన్న శంకర్​ ఎంతకు డోర్​ ఓపెన్​ చేయకపోవడంతో కిటికిలో నుండి లోపలికి చూడగా శంకర్​ ఫ్యాన్​కు ఉరివేసుకొని కనిపించాడు. స్థానికుల సహాయంతో లింగయ్య ఇంటి డోర్​ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే శంకర్​ చనిపోయి ఉన్నాడు.

 

సమాచారం అందుకున్న మియాపూర్​ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శంకర్​ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పదవ పరీక్షల్లో తిరిగి ఫెయిల్​ అవుతానేమోనని శంకర్​ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.