ఎక్కువగా మందు తాగి ఎవరు దొరుకుతున్నారో తెలుసా ?
మద్యం తాగి దొరికిన 300 మంది బైకర్లు..
మద్యం తాగి పోలీసులకు దొరుకుతున్న వారిలో బైకర్లే ఎక్కువగా ఉన్నారు. మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారు కూడా బైకర్లే. వీకెండ్లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో 424 మంది మందుబాబులు మద్యం తాగి పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి పోలీసులకు చిక్కిన వారిలో 300 మంది బైకర్లు, 18 మంది ఆటో డ్రైవర్లు, 99 మంది కారు డ్రైవర్లు, 7 మంది భారీ వాహనాల డ్రైవర్లు ఉన్నారు. వీరందరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. గత వారం నమోదైన 358 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కోర్టులు పరిష్కరించారు. ఇందులో 304 మంది మందుబాబులకు జరిమానా, 22 మందికి జరిమానాతో పాటు సోషల్ సర్వీస్, 32 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు.
