నేటి నుండి శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా
హైదరాబాద్ హ్యాండ్ క్రాఫ్ట్ ప్రేమికుల కోసం ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ హస్తకళ ఉత్సవం ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ఈ నెల 20వ తేది నుండి ప్రారంభం కానుంది. మాదాపూర్లోని శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ అండ్ నేషనల్ జ్యూట్ బోర్డు సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్నట్లు శిల్పారామం స్పెషల్ అఫీసర్ జి. కిషన్రావు తెలిపారు.
ఈ మేళాలో దాదాపుగా 450 స్టాల్ల్స్ శిల్పారామం ఆవరణలో కొలువుదీరనున్నాయి. మేళా సందర్భంగా ప్రతి రోజు శాస్త్రీయ, జానపద, సంగీత వాయిద్య సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్, సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగపూర్ ఆధ్వర్యంలో సిద్ధి ఢమాల్, ఫాగ్ అండ్ ఘుమార్, చౌ నృత్యం, గారడీ గొంబె, కర్గం, కావడి, సంబల్పూరి జానపద నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ అస్సాం అసోసియేషన్, మహారాష్ట్ర అసోసియేషన్ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారతీయ కళాకారులతో పాటు ప్రవాస భారతీయులు లండన్, దుబాయ్, కాలిఫోర్నియా, హవాయి,టెక్సాస్, ఫోనిక్స్విల్లే ,హ్యాంగ్ కాంగ్ నుండి కూడా కళాకారులు పాల్గొంటున్నారు.
