మూడు సైబర్ క్రైమ్ కేసుల్లో నలుగురు అంతరాష్ట్ర సైబర్ నేరస్థులు అరెస్ట్..
- 26 కేసుల్లో 42 రిఫండ్ అర్డర్స్ ద్వారా రూ. 21.98 లక్షలు భాదితులకు రిఫండ్..
ఆరు రోజుల వ్యవధిలో మూడు సైబర్ క్రైమ్ కేసుల్లో నలుగురు అంతరాష్ర్ట సైబర్ క్రిమినల్స్ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు ట్రేడింగ్ ఫ్రాడ్, మోసపూరిత ఫ్రాడ్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 26 కేసుల్లో కోర్టు అనుమతితో 42 రిఫండ్ ఆర్డర్స్ ద్వారా రూ 21.98 లక్షలు బాధితులకు రిఫండ్ చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ సాయి శ్రీ వెల్లడించారు.
చీటింగ్ వెలుగులోకి వచ్చింది ఇలా…
నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి టెలిగ్రామ్లో బెన్ సాషా అనే అమ్మాయి నుండి మెసేజ్ వచ్చింది.ఆమె తనను తాను పరిచయం చేసుకుని ఫారెక్స్ ట్రేడింగ్లో పాల్గొనమని ఉద్యోగిని తెలియజేసింది. భారతీయ స్టాక్ మార్కెట్లో తనకున్న పరిమిత అనుభవం కారణంగా సదరు ఉద్యోగి మొదట్లో సంకోచించాడు. ఆ తర్వాత బెన్ సాషా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న స్లబ్జెంట్ అనే యాప్ని ఉపయోగించి పేపర్ ట్రేడ్లు చేయడానికి అతనికి మార్గనిర్దేశం చేసింది.

సపోర్ట్ స్రెడెక్స్. కామ్ నుండి పొందిన లాగిన్ ఆధారాలతో ఖాతాను సృష్టించి ప్రైవేట్ ఉద్యోగికి సహాయపడింది.ఈ ట్రేడింగ్ ట్రయల్ దశలో ఊహాత్మక లాభాలను పొందినట్లు అతన్ని నమ్మించింది. దీంతో సదరు ఉద్యోగి తన వద్ద ఉన్న డబ్బును పేపర్ ట్రేడ్ యాప్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. కమ్యూనికేషన్ స్ప్రెడెక్స్ గ్లోబల్ లిమిటెడ్ అనే టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా ఈ ట్రేడింగ్ నిర్వహిచాడు.
ట్రేడింగ్ యూఎస్ డాలర్లలో ఉంటుందని అతనికి నమ్మించి ట్రేడింగ్ ఖాతాలోకి నిధులను జమ చేయడం కూదరదని చెప్పిన బెన్ సాషా, తాను సూచించిన బ్యాంక్ ఖాతాలకు డబ్బును బాధితుడు బదిలీ చేశాడు. ఈ డబ్బును రూపాయాల్లోకి మార్చి క్రెడిట్ చేస్తారని పేర్కొన్నారు. దీంతో బాధితడు మొదటిసారి రూ. 50,000 పెట్టగా రెండుసార్లు రూ 5,000 చొప్పున విత్డ్రా చేసుకున్నాడు.
ఇలా బాధితుడు వాయిదాలలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. చివరికి రూ.10,00,000 పెట్టుబడి పెట్టగా, ఆ అమ్మాయి కూడా అతని ఖాతాకు రూ.10,00,000 లాభాలు వచ్చినట్లు చూపెట్టింది. ఈ డబ్బును విత్డ్రా చేసేందుకు బాధితుడు ప్రయత్నించగా, లాభాలపై 30% పన్ను రూ.2,68,000, సెక్యూరిటీ డిపాజిట్ రూ. 5,75,000, కరెన్సీ మార్పిడి కోసం రూ 3,60,000 డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందని బెన్సాషా సూచించింది. దీంతో బాధితుడు సదరు డబ్బు మొత్తం ఆమె సూచించిన ఖాతాలకు పంపించాడు. ఆతర్వాత అతని సిబిల్స్కోరు సరిగ్గా లేదని, సిబిల్ స్కోరు పెంచేందుకు మరో రూ.15,00,000 పంపాలని చెప్పడంతో బాధితుడికి అనుమానం వచ్చి ప్రశ్నించాడు.దీంతో బెన్సాషా అతని చాటింగ్, ట్రేడింగ్ ఖాతాను డిలీట్ చేసింది.బాధుతుడికి యాప్లో రూ. 21,93,300 వర్చువల్ లాభాన్ని కూడా చూపించి మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో చీటింగ్ జరిగినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాధితుడు తన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాల నుండి వివిధ అకౌంట్లకు రూ. 21,93,300- బదిలీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందులో ఒక బ్యాంక్ అకౌంట్కు రూ 90,000 ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా ఇద్దరు నిందితులు సుధాకర్రెడ్డి, రఘునాథ్రెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరు సైబర్ క్రైమ్ కోసం నిందితులకు బ్యాంక్ అకౌంట్లను అందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరి వద్ద నుండి ఐదు సెల్ఫోన్లు, ఆరు సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన మొత్తం నలుగురు నిందితుల్లో ముగ్గురు ట్రేడింగ్, మోసపూరిత చీటింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
